ప్రధానాంశాలు:
- దళితులకు రిజర్వేషన్ల వర్తింపుపై కేంద్రం ప్రకటన.
- రిజర్వేషన్ల నిబంధనలపై పార్లమెంట్లో ప్రస్తావన.
- ఇస్లాం, క్రైస్తవం స్వీకరిస్తే కోల్పోనున్న రిజర్వేషన్లు .
ఎస్సీ, ఎస్టీల జాబితాలోని చాలా మంది మతం మారినప్పటికీ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసి, పదవులు అనుభవిస్తున్నారు.. అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించేందుకు రాజ్యాంగ సవరణ చేసే ఆలోచన ఉందా? అని జీవీఎల్ ప్రశ్నించారు. దీనికి మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదనేదీ లేదని అన్నారు. అయితే నామినేషన్ల సమయంలోనే వారు మతం మార్చుకున్నట్టు రిటర్నింగ్ అధికారులకు సాక్ష్యాలతో ధ్రువీకరిస్తే వారి నామినేష్లను తిరస్కరించవచ్చని చెప్పారు.
ఇస్లాం లేదా క్రైస్తవంలోకి మారిన దళితులు పార్లమెంట్ లేదా అసెంబ్లీ రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీచేయడానికి అనర్హులు.. అలాగే, రాజ్యాంగం కల్పించిన ఇతర రిజర్వేషన్ ప్రయోజనాలు అందుకోలేరు అని కేంద్ర మంత్రి తెలిపారు. ‘రాజ్యాంగంలోని 3 వ పేరా (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ ఇలా పేర్కొంది… హిందూ, సిక్కు, బౌద్ధ మతానికి భిన్నమైన మతాన్ని అనుసరించే ఏ వ్యక్తీ షెడ్యూల్డ్ కులాలకు చెందిన సభ్యుడిగా పరిగణించరు’ అని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి ప్రకటన హిందూ, సిక్కు లేదా బౌద్ధమతాన్ని స్వీకరించడానికి ఎంచుకున్న వారితో ఇస్లాం, క్రైస్తవాన్ని స్వీకరించే దళితుల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపుతుంది. స్వాతంత్రానికి ముందు రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో అణగారిన వర్గాల వారికి రాజకీయ హక్కులు లభించాలంటే వాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ డిమాండ్ చేశారు. కానీ గాంధీజీ అందుకు అంగీకరించకుండా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. చివరికి, అంబేడ్కర్ రాజీ పడి రిజర్వ్డ్ నియోజకవర్గాలకు అంగీకరించారు.