ప్రధానాంశాలు:
- పుదుచ్చేరి అసెంబ్లీలో రేపే బలనిరూపణ.
- తీవ్ర సంక్షోభంలో పాండిచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం.
- ఉత్కంఠగా మారిన రాజకీయ సమీకరణాలు.
ఈ నేపథ్యంలో పుదుచ్చేరి శాసనసభ ప్రత్యేక సమావేశం సోమవారం జరుగనుంది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి మునుస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు పుదుచ్చేరి 14వ శాసనసభ ప్రత్యేక సమావేశం జరుగుతుందని తెలిపారు. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ సమావేశంలో పాల్గొనాలని సభ్యులందరికీ ఆహ్వానం పంపినట్టు పేర్కొన్నారు.
రాజ్భవన్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీ లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖను స్పీకర్ వీపీ శివకొలుంధుకు పంపారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నారాయణసామి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని వ్యాఖ్యానించారు. డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్ కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
కొద్ది రోజుల కిందట ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరగా.. తర్వాత మరో ఇద్దరు రాజీనామా చేశారు. పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసింది. కాగా, ఫిబ్రవరి 18న దీనిపై చర్చలు ఫలితం ఇవ్వకపోయినా, భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడానికి కాంగ్రెస్ కూటమి సమావేశం జరుగుతున్న రోజున లక్ష్మీనారాయణ, వెంకటేశన్ రాజీనామా చేయడం గమనార్హం. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్, మిత్రపక్షాలు సమావేశమవుతున్నాయి.
ఏప్రిల్ – మేలో పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ నేతలతో చర్చించేందుకు.. రాహుల్ గాంధీ పుదుచ్చేరి పర్యటనకు ముందే ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. దీంతో అక్కడ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.