ఢిల్లీలో పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేసిన విషయం కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున ఖాన్ మార్కెట్లో హఠాత్తుగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అన్న నినాదాలు మిన్నంటాయి. ఈ నినాదాలు ఐదుగురు వ్యక్తులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు యువకులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందన్న దానిపై విచారిస్తున్నారు.
తామంతా వివిధ దేశాలకు చెందిన పర్యాటకులమని, తమలో పాకిస్థాన్ పౌరులు ఉన్నారని తెలిపారు. వారి దేశాల పేర్లతో పిలుచుకుంటున్నామని పోలీసులకు సమాధానమిచ్చారు. ఒక వ్యక్తిని పాక్ పేరుతో పిలుస్తున్న సమయంలో సహజంగానే ‘పాకిస్థాన్ జిందాబాద్’ అన్న నినాదం వచ్చిందని వారు పేర్కొనడం గమనార్హం. వీరంతా అద్దెకు వాహనాలు తీసుకుని బైక్ రేసింగ్లో పాల్గొన్నట్టు సమాచారం. వీరంతా తమ పేర్లను వెల్లడించలేదని తెలుస్తోంది.