ప్రధానాంశాలు:
- మూడో సెరోలాజికల్ సర్వే నివేదికను వెల్లడించిన ఐసీఎంఆర్.
- దేశంలో పెరిగిన కరోనా సోకిన 18 ఏళ్లలోపు బాలబాలికలు.
- ఆగస్టుతో పోల్చితే భారీగా పెరిగిన వయోజనుల్లో కరోనా.
ఆగస్టు నాటి మూడో సర్వేతో పోల్చితే కోవిడ్ బారినపడ్డ వయోజనుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం ఇది 21.4 శాతం ఉండగా.. ఆగస్టులో 7.1 శాతం.. ఏప్రిల్లో 0.7 శాతం ఉంది. మూడో సెరోలాజికల్ సర్వేను డిసెంబరు 17 నుంచి జనవరి 8 మధ్య నిర్వహించారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో 700 గ్రామాలలో ఈ సర్వే నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. తొలి దశ గతేడాది ఏప్రిల్, రెండో దశ ఆగస్టులో నిర్వహించారు.
ఫ్రంట్లైన్ వర్కర్స్లో ఆరోగ్య కార్యకర్తలు 25.7 శాతం, వైద్యులు, నర్సులు 26.6 శాతం మంది కోవిడ్ బారినపడ్డారు. జనాభాలో ఎక్కువ భాగం ఇప్పటికీ ముప్పు కలిగి ఉందని ప్రభుత్వం నొక్కిచెప్పింది.. హెర్డ్ ఇమ్యూనిటీకి అవకాశం లేదని, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం అవసరమని సూచించింది. ప్రస్తుతం దేశంలో 1.6 లక్షల యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. గత మూడు వారాలుగా 47 జిల్లాల్లో కొత్త కేసులు.. 251 జిల్లాల్లో కరోనా మరణాలు నమోదుకాలేదు.
దేశవ్యాప్తంగా 10 ఏళ్లు దాటిన 28,589 మంది, 7,171 మంది ఆరోగ్య సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నారు. పట్టణాల్లోని మురికివాడల్లో 31.7 శాతం, ఇతర ప్రాంతాల్లో 26.2 శాతం మంది, గ్రామాల్లో 19.1 శాతం మందికి కరోనా సోకింది. అయితే, కోవిడ్ సోకిన పురుషుల కంటే మహిళలే అధికం కావడం గమనార్హం. మహిళలు 22.7 శాతం, పురుషులు 20.3 శాతం మంది కరోనా వైరస్ బారినపడ్డారు.