ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు రైతు సంఘాల నేతలు స్పందించారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని.. సమావేశాలకు తేదీ నిర్ణయించాలని అన్నారు. రాజ్యసభలో సోమవారం (ఫిబ్రవరి 8) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ప్రధాని మోదీ.. రైతుల ఆందోళన గురించి ప్రస్తావించారు. రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులు తమ ఆందోళన విరమించి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి.
కేంద్రంతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని.. అయితే, ప్రభుత్వం నుంచి అధికారిక ఆహ్వానం రావాలని మరో నాయకుడు అభిమన్యు కోహర్ అన్నారు. ‘కనీస మద్దతు ధరలో మార్పుండదని ప్రభుత్వం చెబుతోంది. మరి అలాంటప్పుడు దానిపై చట్టబద్ధమైన హామీ ఎందుకు ఇవ్వలేకపోతోంది?’ అని ఆయన ప్రశ్నించారు.