వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులు.. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఉద్యమంలో సంఘ విద్రోహక శక్తులు కలిశాయని రైతు నేతలు ఆరోపించారు. ఉద్యమాన్ని తప్పుదారి పట్టించి, ఘర్షణలకు కారణమయ్యాడని దీప్ సిద్ధూపై ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఆధారాలను సేకరించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
గణతంత్ర దినోత్సవం నాటి కిసాన్ పరేడ్లోనూ సిద్ధూ ఎర్రకోట వద్ద కనిపించి అందరికీ షాకిచ్చాడు. ఎర్రకోట ప్రాంగణంలో రైతులు తమ జెండాలతో పాటు నిశాన్ సాహిబ్ జెండాలను ఎగరేసిన సమయంలో దీప్ సిద్ధూ అక్కడే ఉన్నాడు. జెండాలు ఎగరేసిన తర్వాత కొంత మంది రైతులు దీప్ సిద్ధూను ఛేజ్ చేయగా అతడు పారిపోయాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది.
మరోవైపు.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ దీప్ సిద్ధూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశాడు. ‘నేను దేశ ద్రోహినైతే.. రైతు నాయకులు కూడా దేశ ద్రోహులే అవుతారు’ అని ఆ వీడియోలో వ్యాఖ్యానించాడు.
Must Read:ఢిల్లీ అల్లర్ల వెనుక పంజాబీ నటుడు.. ప్రధానితో ఉన్న ఫొటో వైరల్