వలస పక్షులకు బర్డ్ ఫ్లూ సోకకుండా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ కోరింది. ఈ వైరస్ పౌల్ట్రీరంగానికి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏ కారణంగానైనా వలస పక్షుల మృతి చెందితే తమకు నివేదించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రతివారం నివేదికలను సమర్పించాలని స్పష్టం చేసింది.
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో జంతు ప్రదర్శనశాలల్లో నిఘా పెంచాలని పేర్కొంది. జంతువులు, పక్షులను పట్టుకునేటపుడు రక్షణ కవచాలు ధరించాలని, సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని ప్రజలకు కేంద్రం సూచించింది. పెంపుడు జంతువులను పట్టుకునేటపుడు రక్షిత కళ్లజోడు ధరించాలని, వాటిని చేత్తో పట్టుకొని తినడం, మంచినీళ్లు, పొగ తాగడం మానుకోవాలని కోరింది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలో భారీగా పక్షులు చనిపోవడంతో దీనికి కారణాలపై ఆరా తీయగా.. వాటికి బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. బర్డ్ ఫ్లూని వైద్య పరిభాషలో ఏవియన్ ఇన్ఫ్లూయేంజా అంటారు. ఇది పక్షులలో సంక్రమించే హెచ్5ఎన్1 రకం వైరస్.. అయినప్పటికీ, మానవులకు హాని కలిగిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తిలో ఫ్లూ లాంటి లక్షణాలు ఉంటాయి.
బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇన్ఫ్లూయేంజా మాదిరిగానే ఉంటాయి. గొంతు నొప్పి.. దగ్గు, జ్వరం, అతిసారం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం.. వాంతులతోపాటు ఇతర లక్షణాలు లేకుండా కేవలం కంటికి కూడా సంక్రమించవచ్చు.