రాజస్థాన్లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాలోర్ జిల్లా మహేష్పూర్లో బస్సుకు కరెంటు తీగలు తగిలి మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు. విద్యుత్ తీగలు తగలడంతో క్షణాల్లోనే బస్సు కాలిబూడిదయ్యింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ సజీవదహనం అయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. గాయపడిన మరో 17 మంది జోధ్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
జాలోర్ జిల్లా హెడ్క్వార్టర్స్ సమీపంలో శనివారం రాత్రి 10.30 గంటలప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఘటనా స్థలిలోనే డ్రైవర్, కండక్టర్ చనిపోయారని, ఆస్పత్రిలో మరో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారని పేర్కొన్నారు. గాయపడిన 17 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వీరిని జోధ్పూర్ ఆస్పత్రికి తరలించినట్టు అడిషనల్ కలెక్టర్ గోయల్ తెలియజేశారు.