ఇదిలా ఉండగా.. ఈ భయానక విపత్తుకు అందరూ భావించినట్లు గ్లేసియర్ బరస్ట్ (హిమనీనదం పేలుడు) కారణం కాదని రైనీ గ్రామస్థులు చెబుతున్నారు. వారు మరో సంచలన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 56 ఏళ్ల కిందట అధికారులు నందాదేవి శిఖరంపై ఓ రేడియో యాక్టివ్ (రేడియోధార్మిక పదార్థం) పరికరాన్ని ఏర్పాటు చేశారని.. ఆ తర్వాత ఆ పరికరం మిస్సైందని తెలిపారు. తాజా పేలుడుకు ఆ పరికరమే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
‘CIA, IB అధికారులు 1965లో నందాదేవి శిఖరంపై అణుశక్తితో కూడిన న్యూక్లియర్ పరికరాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. చైనాపై నిఘా ఉంచడానికి ఆ పరికరాన్ని అక్కడ పెట్టాలని భావించారు. అయితే.. పర్వత శిఖరంపై పరిశీలనకు వెళ్లిన అధికారుల బృందం ఊహించని ప్రమాదం బారిన పడింది. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడే క్రమంలో ఆ రేడియో యాక్టివ్ డివైజ్ను అక్కడే వదిలేశారు’ అని రైనీ గ్రామస్థులు చెప్పారు.
మరుసటి సంవత్సరం అధికారులు అక్కడికి మళ్లీ వెళ్లారని.. అయితే, ఆ రేడియో యాక్టివ్ పరికరం మాత్రం కనిపించకుండాపోయిందని గ్రామస్థులు తెలిపారు. ‘ఆ పరికరం జీవిత కాలం వందేళ్లు. ఇప్పటివరకు అది ఆ మంచు కొండల్లో ఎక్కడో ఉండే ఉంటుందని భావిస్తున్నారు’ అని వారు చెప్పుకొచ్చారు.
ప్రమాద సమయంలో భరించలేని వాసన..!
ఆదివారం ప్రమాదం జరిగిన నందాదేవి పర్వత శిఖరానికి సమీపంలోనే రైనీ గ్రామం ఉంది. ప్రమాదాన్ని కొంత మంది గ్రామస్థులు దగ్గరి నుంచి చూశారు. ఆ రోజు ప్రమాదం జరిగిన తీరును వివరించారు.
‘పర్వత శిఖరం పైనుంచి మంచు కొండ ఒక్కసారిగా విరిగి కుప్పకూలింది. అందులోంచి ఉప్పెనలా నీరు పొంగి రిషిగంగా నదిలోకి దూకింది. దీంతో వరద ఉధృతి పెరిగింది. ఆ ప్రవాహం.. అడ్డుగా ఉన్న రాళ్లను, డ్యామ్లను తుత్తునియలు చేస్తూ ముందుకు దూకింది. ఒక్కసారిగా అక్కడ బీతావహ వాతావరణం నెలకొంది’ అని గ్రామస్థులు తెలిపారు.
కొండ శిఖరం పైనుంచి భారీ శబ్దంతో మంచు కొండ విరిగిపడిన వెంటనే అక్కడ ఘాటైన వాసన వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. ‘ఆ వాయువు చాలా ఘాటుగా ఉంది. మేం కొద్దిసేపు ఊపిరి పీల్చుకోలేకపోయాం. ఇది మంచు కొండ విరిగిపడటం, శిథిలాల కారణంగా వచ్చిందని భావించలేం. దీంతో మాకు అనుమానం వచ్చింది. మా పెద్దలు తరచూ చెప్పే మాటలు గుర్తుకొచ్చాయి. నందాదేవి శిఖరంపై రేడియో యాక్టివ్ పరికరం మిస్సైన ఘటన గురించి మా పెద్దలు మాకు చెప్పారు’ అని వారు వివరించారు.
1965లో నందాదేవి శిఖరంపైకి వెళ్లిన అధికారుల బృందానికి కొంత మంది గ్రామస్థులు సహకరించారు. వారిలో ఒక వ్యక్తి భార్య అయిన ఇమర్తి దేవి (90 ఏళ్లు) తాజాగా జరిగిన ప్రమాదంలో మృతి చెందడం మరో విషాదకర అంశం.
సంగ్రామ్ సింగ్ రావత్ అనే మరో గ్రామస్థుడు కూడా ఆ రేడియోధార్మిక పరికరంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఆదివారం నాటి ఘటన అనంతరం భయంతో అతడు తన కుటుంబంతో కలిసి ఊరికి దూరంగా అడవిలో ఉంటున్నాడు.
2018లో పర్యాటక మంత్రి సప్తాల్ మహరాజ్ ఆ రేడియోధార్మిక పరికరం గురించి ప్రస్తావించడం గమనార్హం. ‘నందాదేవి శిఖరంపై మిస్సైన ఆ పరికరం.. ఆ మంచు కొండలను కలుషితం చేస్తోంది. దాన్ని వెలికితీయడానికి తక్షణమే ప్రయత్నాలు ప్రారంభించాలి. ప్రధాని మోదీ ఈ దిశగా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు తేల్చాల్చి ఉంది.